సంక్రాంతి స్వరసమరం.. ఐదోసారి డీఎస్పీ, తమన్ పోటీ!
on Jul 2, 2022
సంక్రాంతి సీజన్ లో ఇప్పటికే నాలుగు సార్లు పోటీపడ్డ టాలీవుడ్ టాప్ కంపోజర్స్ దేవి శ్రీ ప్రసాద్, తమన్.. ఇప్పుడు ఐదోసారి స్వరసమరానికి సిద్ధమవుతున్నారు.
ఆ వివరాల్లోకి వెళితే.. 2016 సంక్రాంతికి దేవి శ్రీ స్వరాలు సమకూర్చిన `నాన్నకు ప్రేమతో`, తమన్ బాణీలందించిన `డిక్టేటర్` రెండు వరుస రోజుల్లో విడుదల కాగా.. 2020 పొంగల్ కి డీఎస్పీ సంగీతమందించిన `సరిలేరు నీకెవ్వరు`, తమన్ ట్యూన్స్ కట్టిన `అల వైకుంఠపురములో` కూడా అదే బాట పట్టాయి. ఇక 2021 ముగ్గుల పండక్కి దేవి శ్రీ మ్యూజిక్ లో `అల్లుడు అదుర్స్` రాగా, ఆ సినిమాకి ఐదు రోజుల ముందు తమన్ `క్రాక్` ఎంటర్టైన్ చేసింది. అదేవిధంగా, 2022 జనవరి 14న డీఎస్పీ `రౌడీ బాయ్స్` రిలీజ్ కాగా.. అదే రోజున తమన్ కంపోజ్ చేసిన `సూపర్ మచ్చి` జనం ముందుకు వచ్చింది.
కట్ చేస్తే.. 2023లోనూ ఈ ఇద్దరు స్టార్ కంపోజర్స్ కొత్త చిత్రాలతో పలకరించనున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి - దర్శకుడు బాబీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాతో దేవి శ్రీ సందడి చేయనుండగా.. కోలీవుడ్ స్టార్ విజయ్ - డైరెక్టర్ వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో రూపొందుతున్న `వారసుడు`తో తమన్ ఎంటర్టైన్ చేయనున్నాడు. మరి.. ఐదోసారి సంక్రాంతి క్లాష్ కి సిద్ధమవుతున్న డీఎస్పీ, తమన్.. ఎలాంటి ఫలితాలను అందుకుంటారో చూడాలి.
Also Read